తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా డిసెంబర్ 10, మంగళవారం నాడు కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్, మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజి), అన్నారం (సరస్వతి బ్యారేజీ) లను సందర్శించారు. ముందుగా గవర్నర్ దంపతులు కాళేశ్వరంలో శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. తర్వాత ముక్తీశ్వర స్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. పంపుహౌస్ లో అమర్చిన 12 మోటార్ల ద్వారా గోదావరి జలాలను లిఫ్ట్ ద్వారా పంపింగ్, వాటి పనితీరు గురించి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు గవర్నర్కు వివరించారు.
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభస్థానమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజి వాల్ గేట్లను, నీటి ప్రహవాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీని కొద్దిసేపు తిలకించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పవరమని, సాగునీటితో పాటు రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయని, కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ఇంజనీరింగ్ అద్భుతమని అభివర్ణించారు. చివరిగా మహాదేవపూర్ మండలం అన్నారం లోని కాళేశ్వరం ప్రాజెక్టు రెండో పాయింట్ అయిన సరస్వతి బ్యారేజీని గవర్నర్ దంపతులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిణి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇంచార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం పర్యటన ముగించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై పెద్దపల్లి జిల్లాకు బయల్దేరి వెళ్లారు.
[subscribe]