ప్రస్తుతమున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కాలపరిమితి మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో, కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు క్రికెట్ సలహా సంఘాన్ని (సీఏసీ) త్వరలోనే ఏర్పాటు చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. వారం రోజుల్లోనే సీఏసీ సభ్యుల్ని నియమిస్తామని, ఇప్పటికే భారత్ జట్టు హెడ్ కోచ్ ఎంపిక పూర్తి కావడంతో కేవలం జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నియామకం లక్ష్యంగానే సీఏసీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తో పాటు మరో సభ్యుడు గగన్ ఖోడా పదవీకాలం త్వరలో పూర్తవుతుంది. ఇక ఇతర సభ్యులు దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపే, శరణ్ దీప్ సింగ్ లకు మరో ఏడాది పదవీకాలం మిగిలుంది.
ఈ క్రమంలో కొత్త సెలెక్షన్ కమిటీ నియామకంపై బీసీసీఐ దృష్టి సారించింది. అయితే ఇంతకుముందు సీఏసీ సభ్యులుగా పనిచేసిన వారందరూ, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంతో ముడిపడి ఉండడంతో వారి పదవుల్ని వదులుకున్నారు. మొదటగా సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీలతో క్రికెట్ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయగా, రెండోసారి కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలుతో ఏర్పాటు చేశారు. వీరంతా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కలిగిఉన్నారన్నా ఆరోపణలతోనే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు ఈసారి సీఏసీ సభ్యులుగా ఎవరిని నియమిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మరో వైపు ఐపీఎల్-2020 వేలంపాటపై స్పందిస్తూ, ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ రూ.15.5 కోట్లుకు కొనుగోలు కావడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు. ఎక్కడైనా డిమాండ్ బట్టే ధర ఉంటుందని, గతంలో కొంతమంది ఆటగాళ్ల లాగానే కమిన్స్ కి కూడా డిమాండ్ ఉండడంతో అంత ధర పలికాడని చెప్పారు.