హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఈ ఘటన తనను షాక్ కి గురి చేసిందన్న ఆయన మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు దీనిపై మంగళవారం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పిన ఆయన, జంతు సంరక్షణ కేంద్రాలు మరియు జంతు జనన నియంత్రణ కేంద్రాలు కూడా దీని కోసం ఏర్పాటు చేయబడ్డాయని, అలాగే కుక్కల స్టెరిలైజేషన్కు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, ఫిబ్రవరి 23న నగరంలో వీధికుక్కలు, కోతులు వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఘటనలో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగాధర్ కుటుంబంతో సహా హైదరాబాద్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అంబర్పేట చౌరస్తాలోని ఓ కార్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న అతను ఆదివారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని సర్వీసింగ్ సెంటర్కు వెళ్లాడు. అయితే గంగాధర్ తన పనిలో ఉండగా ఐదేళ్ల ప్రదీప్ ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. ఈ సమయంలో కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా దూసుకొచ్చి బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE