తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను నవంబర్ 25, సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు విరమించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. ఈయూ కార్యాలయంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని కార్మికులంతా వారి డిపోల వద్దకు వెళ్లి విధుల్లో చేరాలని కోరారు. తాము సమ్మెను విరమించినందు వలన విధుల్లోకి వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇకపై విధులకు హాజరుకావొద్దని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మిక న్యాయస్థానంలో కార్మికులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, తమ పోరాటాన్ని భవిష్యత్లో దశలవారీగా కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు మొదటి షిఫ్ట్ కార్మికులతో పాటుగా రెండో షిఫ్ట్ కార్మికులు కూడా బస్ డిపోల వద్దకు చేరుకొని విధుల్లో చేరాలని సూచించారు.
మరోవైపు కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ స్పందిస్తూ, మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఒక పక్క పోరాటం కొనసాగిస్తామని చెబుతూనే, మరో పక్క సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారని అన్నారు. వారికీ ఇష్టమొచ్చినట్టు విధులకు హాజరుకాకుండా, ఇప్పుడొచ్చి మళ్ళీ విధుల్లో చేరతామంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కుదరదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు వారి ఇష్టానుసారమే విధులకు హాజరుకాకుండా చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు, ఆర్టీసీ యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. దసరా, దీపావళిలాంటి ముఖ్యమైన పండుగల సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గించారని అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని బట్టే ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమ్మె విషయంలో అంతా చట్టబద్ధంగా జరుగుతుందని, అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే కార్మికులు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని కోరారు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించి ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదని, వారిపై చట్టపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సునీల్ శర్మ స్పష్టం చేశారు.
[subscribe]