హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో రైల్ మార్గం అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7 సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మార్గం ప్రారంభమైతే హైదరాబాద్ మెట్రో కారిడార్ పొడవు 67 కిలోమీటర్లకు చేరుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో చివరిదైన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు ఇటీవలే తుది అనుమతులు లభించాయి. అలాగే ఈ మార్గంలో 45 రోజులపాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. 11 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్ , సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ వంటి 9 స్టేషన్లు ఉన్నాయి. తొలుత సంక్రాంతి సమయానికే ఈ మార్గాన్ని ప్రారంభించేందుకు అధికారులు సిద్దపడగా, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా కొద్దీ రోజులు వాయిదా పడింది.
[subscribe]