ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల డంపింగ్, కాపర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి పెంటపాటి పుల్లారావు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందుగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్మాణం చేపట్టారని, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించే పోలవరం అథారిటీ సీఈవో ఎన్జీటీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు, తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేశారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతాల గురించి పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ ను కూడ పోలవరం డంపింగ్ కేసుతో పాటే నవంబర్ 7న విచారణ చేస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై కూడ ఎన్జీటీ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేసినందువలన పర్యావరణ అనుమతులు కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను ఎన్జీటీ కొట్టివేసింది. పిటిషన్ సవరించి మధ్యంతర అప్పీలు చేసుకోవచ్చని, తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
[subscribe]