హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతు రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, తెరాస రాజ్యసభ ఎంపీ కేకే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కనుమూరి బాపిరాజు తో పాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయమే దసరా అని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రముఖ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీక అని, అంతే కాకుండా బతుకమ్మ, బోనాలు తెలంగాణ సమాజానికి గౌరవమని, నేటి యువత దేశభక్తి భావనను పెంపొందించు కోవాలన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను పర్యాటకంగా అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బండారు దత్తాత్రేయ తనకు మార్గదర్శకులని అన్నారు. 15 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా అందరిని ఒకే చోటుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు.
[subscribe]