ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ కాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించగా ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్ను చిరంజీవి కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా చిరంజీవి ఆయనతో భేటీ కాబోతున్నారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా చిరంజీవి కోరగా, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని వీక్షించి అద్భుతంగా ఉందంటూ ప్రశంచించారు. స్వాతంత్ర్య పోరాటంలో తెల్ల దొరలపై తొలిసారిగా పోరాటానికి దిగిన, కర్నూలు ప్రాంతానికి చెందిన పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా, ప్రముఖ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అభిమానులు, ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు నుండి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
[subscribe]