ప్రణాళికబద్దంగా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు సఖీ, మహిళా సంఘాల సభ్యుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవల కార్యక్రమాన్ని గురువారం ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా భవన్ లో మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి, 424 బ్యాంకు సఖీలకు బయోమెట్రిక్ పరికరాలు అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక్క రూపాయి పొదుపుతో డ్వాక్రా గ్రూపులుగా అంచలంచలుగా ఎదిగారని, తెలంగాణ ఏర్పడ్డాక ఎలాంటి పూచీకత్తులేకుండా అడిగినంత రుణ సౌకర్యం మహిళలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది 15 వేల కోట్లు బ్యాంకులింకేజీ రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో సక్రమంగా తిరిగి చెల్లించడం వల్ల బ్యాంకులు మహిళలకు రుణాలు అందించడంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. నేడు మహిళల్లో పట్టుదల పెరిగిందని, ఎంతో చైతన్యంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.
దేశంలోనే స్త్రీనిధి, ఐకేపీల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది:
తెలంగాణ రాకముందు తాగడానికి నీరులేక కుండలు, బిందెలతో మహిళలు రోడ్లపైకి వచ్చేవారని, అది ఈనాడు లేక పోవడం తెలంగాణ సాధించిన విజయం కాదా అని మంత్రి ప్రశ్నించారు. 24 గంటలపాటు విద్యుత్, మిషన్ భగీరథ తాగునీరు, గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనమని మంత్రి అన్నారు. ప్రతిచెరువు నిండుతోందని, భూములు అమ్ముకునే దుస్థితి నేడు లేదన్నారు. బిడ్డల పెళ్ళికి చేసే అప్పులు నేడు కళ్యాణలక్ష్మి ద్వారా రూపుమాసిపోయిందన్నారు. మేనమామలా ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రసవాలకు ఆర్థిక సహాయంతో కేసీఆర్ కిట్లు అందించడం, ఇవన్ని మహిళల అభివృద్ధికి చేసినా పథకాలు కావా అని ఆయన అన్నారు. గ్రామీణ ప్రజలను మహిళా సంఘాల సభ్యులను బ్యాంకు సఖి ద్వారా ఓపిక సహనంతో ఆదుకుని రాత్రి పగలు లేకుండా సేవలందించాలని సూచించారు. తద్వారా మహిళలకు ఎంతో గౌరవం చేకూరగలదని అన్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలన్ని బ్యాంకు సఖీ ద్వారా, మహిళా సంఘాల ద్వారా అందించే అవకాశాలు ఉంటాయన్నారు. బ్యాంకు సఖీలు 4,5 గ్రామాలను అనుసంధానంగా పనిచేస్తూ మహిళలను కష్టాల నుండి కడతేర్చే పెద్ద దిక్కుగా ఎదగాలని సూచించారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని, ఇందుకు 7 వేల కోట్లతో పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రతి వస్తువు మహిళా గ్రూపుల ద్వారానే తయారు కావాలని, తద్వారా కల్తీ నివారించగలమని మంత్రి అన్నారు. భారత దేశంలోనే స్త్రీనిధి, ఐకేపీల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయితి రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, ‘సెర్ప్’ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు ఆదాయ మార్గాలు పెంపొందించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి, రైతుభీమా, రైతుబందు తదితర పథకాల ద్వారా గ్రామీణాభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 లక్షల 30వేల సంఘాలలో 45 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉండి ఆదాయ మార్గాలు పెంపందించుకుని అభివృద్ధి మార్గంలో ఉన్నట్లు తెలిపారు. గ్రామీణా వ్యవస్థలో పేద మహిళలు బ్యాంకుల వద్దకు వెళ్ళలేరని, వారి సౌకర్యార్థం బ్యాంకు సఖీలు దోహదపడతాయన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామస్థాయికి చేర్చడమే బ్యాంకు సఖీల ప్రధాన కర్తవ్యమని, 4, 5, గ్రామాలను అనుసంధానం చేస్తూ తొలివిడతగా 2000 గ్రామాలకు 424 బ్యాంకు సఖీలను ఏర్పాటు చేస్తూ గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థకు నాంది పలికినట్లు తెలిపారు. ఎంపికైన 424 మంది బ్యాంకు సఖీలు గ్రామస్థాయిలో మహిళలతో సమావేశమై అందించే సేవలపై అవగాహన కలిగించాలని సూచించారు. మంత్రి దిశానిర్దేశం, బ్యాంకర్ల సహకారంతో ‘బ్యాంకు సఖీ’ విజయవంతమైందన్నారు. ఇప్పటికే పశుమిత్ర కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు శిక్షనిచ్చినందున గోపాలమిత్ర తరహాలో పనిచేస్తున్నారని ఆన్నారు. ఔత్సాహికులైన మహిళలు చిన్న చిన్న వ్యాపారాల కోసం సెర్ప్ ద్వారా ప్రోత్సహిస్తున్నామని, 70వేల మంది ఔత్సాహిక మహిళలకు గత ఏడాది 535 కోట్లు పెట్టుబడి అందించినట్లు తెలిపారు.
నాబార్డు జనరల్ మేనేజర్ సెల్వన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలతో అనుసంధానమైన వినూత్న కార్యక్రమంగా అభివర్ణించారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం డిజిటల్ లిటరసీ సేవలు ఎంతో అవసరమని, నాబార్డు ద్వారా ఇందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విజన్ దృష్టిలో ఉంచుకుని మహిళా సాధికారతకు నాబార్డు కృషి చేస్తోందన్నారు. ఎస్.బి.ఐ ఎ.జి.యం. నటరాజన్ మాట్లాడుతూ, తెలంగాణలో మహిళా సంఘాలకు రుణాలు అందించడంలో ఎస్.బి.ఐ. ముందంజలో ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 35 శాతం సబ్సిడీతో సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ సేవా విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజకిషోర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు అన్నిరకాల సేవలు సులభతరం చేయడమే బ్యాంకు సఖీల ప్రదాన ఉద్దేశ్యమన్నారు. నమ్మకముంటేనే లావాదేవీలు సక్రమంగా నిర్వహించగలమని, నమ్మకాన్ని పెంపొందించుకోవాలని బ్యాంకు సఖీలకు సూచించారు. గ్రామాలలో గట్టి పనులు, మట్టి పనులు చేసేవారిని బ్యాంకు సఖీలు ఇబ్బందులకు గురిచేయకుండా ఓపికతో వ్యవహరించాలని కోరారు. రానున్న రోజులలో మరిన్ని సేవలను అందించేందుకు బ్యాంకు సఖీలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి “డిజి పే సఖి” గోడ పత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘సెర్ప్’ బ్యాంకు లింకేజీ విభాగం డైరెక్టర్ వైఎస్.రెడ్డి, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్స్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY