తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని ఆయన అన్నారు. జరుగుతున్న సమ్మె పై స్పందిస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వం సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని జనసేన అభిప్రాయపడుతోందని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు, నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని, వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉందని చెప్పారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా వుంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు గారిని కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
[subscribe]