ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను ఒకేరోజు టీఆర్ఎస్ లోకి చేర్చుకుంది. శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత స్వామిగౌడ్ మరియు తెలంగాణ ఉద్యమకారుడు, కీలక నేత దాసోజు శ్రావణ్లు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ వారిరువురికీ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని, అలాగే దాసోజు శ్రావణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ ప్రశంసించారు. ఇక వీరితోపాటు త్వరలో మరి కొంతమంది బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నారని కేటీఆర్ ప్రకటించారు.
స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కలిసి పోరాటం చేశామని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలిగేది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని పేర్కొన్నారు. అలాగే బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాముఖ్యత అధికంగా ఉందని, బలహీన వర్గాల ఉన్నతికి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలిపారు. ఇక దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, నవభారత నిర్మాణం ఆయనతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక తనను కుటుంబంలో ఒక సభ్యుడిలా ఈరోజు పార్టీలోకి ఆహ్వానించారని, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు.
కాగా గురువారం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్కు కూడా మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం పార్టీలోని మిగిన నేతలతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పార్టీలోని కీలక నేతలు జితేందర్ రెడ్డి, విఠల్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తదితరులు పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY