భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్ఎస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్తో పోరాడేది కేవలం బీజేపీయే అన్న నడ్డా.. 317 జీవో సవరించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చానని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పోరాడుతుందన్నారు. బండి సంజయ్ కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేశారని, అయినా అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేసారని మండిపడ్డారు.
జీవోనెంబర్ 317పై జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి పిలుపునిచ్చింది బీజేపీ. ఇందులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు జేపీ నడ్డా. కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా పలువురు నేతలు లోపలకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి పెద్దయెత్తున చేరుకున్న పోలీసులు.. నడ్డా బయటకు రాగానే కరోనా ఆంక్షల జీవోను చూపించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సభలకు, సమావేశాలకు అనుమతి లేదని వివరించారు. అయితే, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. మమ్మల్ని మాత్రం అడ్డుకుంటున్నారని పోలీసులపై నడ్డా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ