తెలంగాణ రాజకీయాలలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఆయన గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే త్వరలో బీజేపీలో కూడా చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న తన అనుచరులు, అభిమానులతో పలు నియోజకవర్గాల్లో అనేకచోట్ల ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం దీనికి బలం చేకూరుస్తోంది. అంతేకాక ఆ సమావేశాల్లో పొంగులేటి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజల నుంచి వేరు చేయలేరని, పదవులు తనకు ముఖ్యం కాదని, ప్రజల అభిమానం ఉంటే చాలు.. పదవులు అవే వస్తాయని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గతంలో పొంగులేటి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు కూడా.
ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్సార్టీపీ అధినేత్రితో ఆయన సమావేశం కావడం చర్చనీయాంశం అవుతోంది. ఒకవైపు ఇప్పటికే వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆమె పాదయాత్రపై అధికార పార్టీ శ్రేణులు దాడులు చేయడం, ఆ తర్వాత శాంతిభద్రతల కారణంగా షర్మిల యాత్ర కొనసాగించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, తదనంతర పరిణామాలలో ప్రగతి భవన్ వద్ద ఆందోళన నేపథ్యంలో ఆమె వాహనాన్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు లాక్కెళ్లడం వంటివి వరుసగా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు షర్మిలతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ కావడంతో ఆయన వైఎస్సార్టీపీ వైపు చూస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పటివరకూ ఈ భేటీపై ఇరు వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE