జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ కారుపై కూర్చుని ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారుపై కూర్చొని వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్, హైవేలో పవన్ వాహనాన్ని మిగతా వాహనాలు అనుసరించడం వంటి అంశాలపై తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పీఎస్ లో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పవన్ పర్యటన సందర్భంగా వారి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తాను బైక్పై నుండి నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయాయని శివ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై ఐపీసీ 336, 279, రెడ్విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు అయింది. అలాగే పవన్ కళ్యాణ్ కారు డ్రైవర్ పై కూడా రాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబర్ 5న పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ముందుగా ఇప్పటం వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ముందే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అడ్డుకోవడంతో పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. దీంతో పవన్ కళ్యాణ్ వాహనం దిగి నడుచుకుంటూ, కాలినడకనే ఇప్పటం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం వెళ్లాక పవన్ కళ్యాణ్ తిరిగి తన కారు పైకెక్కి ప్రయాణిస్తూ ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి, వారికీ తన సంఘీభావం తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE