తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీ నుండి “స్వతంత్ర భారత వజ్రోత్సవ” వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22వ వరకు రోజువారీ కార్యక్రమాలతో ఈ వేడుకలను గొప్పగా జరపనున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం (ఆగస్టు 16, మంగళవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘సామూహిక జాతీయ గీతాలాపన’ (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలతో పాటుగా గుర్తించిన ఇతర ప్రదేశాలలో ఆగస్టు 16, మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఆగస్టు 16 ఉదయం 11.30 గంటలకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని , జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా, అత్యంత క్రమశిక్షణతో జాతీయ గీతం ఆలపించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో సామూహిక జాతీయ గీతాలాపన జరిగే పలు ప్రాంతాలను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రాంతాలైన అబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్ వాటర్ ఫ్రంట్ కూడలి తదితర ప్రాంతాల్లో నిర్వహించే జాతీయ గీతాలాపన ఏర్పాట్లను వివిధ శాఖల సీనియర్ అధికారులతో కలసి సీఎస్ పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంతోపాటు, నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రధాన కూడలి అబిడ్స్ లో నెహ్రూ విగ్రహం వద్ద రేపు ఉదయం సామూహిక జాతీయ గీతాలపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా ఒక ప్రధాన కూడలిలో ఈ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. జీపీఓ సర్కిల్ వద్ద జరిగే కార్యక్రమాలు స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించాలని, రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్నఉద్యోగులు పలు కళాశాలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేందుకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY