ఎన్ని నియోజకవర్గాలున్నా.. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా కూడా..నేతల చూపుతో పాటు ఓటర్ల చూపు కూడా కామారెడ్డి నియోజకవర్గం వైపే ఉండేది. కామారెడ్డిలో 1994 నుంచి అంటే 29 ఏళ్లుగా గంప గోవర్ధన్, షబ్బీర్ అలీల మధ్య ఎన్నికల సమరం..పోటాపోటీగా జరిగేది. ఇద్దరికీ బలమైన కేడర్ ఉండటంతో నువ్వా నేనా అన్నట్లుగా ఉండేది . ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి.. గంప గోవర్ధన్ ఏకంగా నాలుగుసార్లు గెలిచి రికార్డును సృష్టించారు. మరోవైపు మాచారెడ్డి మండలవాసి అయిన షబ్బీర్ అలీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు. 1989 వ సంవత్సరం, 2004 వ సంవత్సరం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్ అలీ ..రెండు సార్లు మంత్రిగానూ పనిచేశారు.
అటు బిక్కనూరు మండలం బస్వాపూర్కి చెందిన గంప గోవర్ధన్.. సింగిల్విండో చైర్మన్గా తెలుగు దేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో తెలుగు దేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న గంప గోవర్థన్.. ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి యూసుఫ్ అలీకి టికెట్ ఇవ్వడంతో అలాగే..2004లో టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల గంపకు టికెట్ దక్కలేదు. అయితే 2009లో రెండోసారి, 2014లో మూడోసారి గంప, షబ్బీర్ల మధ్య బలంగానే పోటీ కొనసాగింది.అయితే ఈ మూడుసార్లు కూడా గంప గోవర్ధన్ ఎన్నికల్లో విజయం సాధించినా ూకడా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మాత్రం చివరి వరకూ రసవత్తరంగా సాగాయి. 2014లో అయితే నువ్వా నేనా అన్నట్లుగా సాగి.. చివరికి స్వల్ప మెజారిటీతో గంపగోవర్ధన్ గెలిచారు.
అయితే ఇప్పటి వరకూ పార్టీలు మారినా ప్రత్యర్థులు మారలేదన్న సీనే కనిపించింది. ఈ సారి కామారెడ్డి ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారింది. ప్రతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా సై అంటే సై అన్నట్లుగా ఉంటూ వస్తున్న గంప గోవర్ధన్, షబ్బీర్ అలీ కూడా ఈ సారి ఎన్నికల బరిలోనే లేరు. గెలుపోటముల గురించి పక్కన బెడితే కామారెడ్డి రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేవి. ఈసారి ఏకంగా ఇక్కడ బరిలో సీఎం కేసీఆర్, రేవంత్రెడ్డి రాకతో నియోజకవర్గంలో అదో జోష్ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన వెంకటరమణారెడ్డి కూడా విస్తృత పర్యటన చేస్తూ ప్రచారానికి హీటు పుట్టిస్తున్నారు.
మొదటగా కాంగ్రెస్కు కంచుకోటగా గుర్తింపు పొందిన కామారెడ్డి నియోజకవర్గం..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ కామారెడ్డి నియోజకవర్గంలో మొన్నటి వరకు ప్రధాన పార్టీల ప్రత్యర్థులుగా బరిలో దిగుతూ వస్తోన్న గంప గోవర్దన్, షబ్బీర్ అలీ ఇద్దరికీ కూడా బలమైన కేడర్ ఉంది. ఇద్దరికీ కూడా గ్రామ, మండల స్థాయిలో ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెన్నంటే ఉన్నారు. అలాగే రెండు సార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్అలీ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలవగా.. అలాగే గంపగోవర్ధన్ కూడా ఎంతో మంది నాయకులకు, కార్యకర్తల అభ్యున్నతికి చేయందించారు. అందుకే ఇప్పటికీ వారితో కలిసి పని చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తుంటారు. అలా కార్యకర్తలే పార్టీలకు బలం అని ఈ ఇద్దరు నేతలు నిరూపించారు.
కామారెడ్డి బలమైన కేడర్ను సంపాదించుకున్న చిరకాల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్ల మధ్య పోటీతత్వమూ ఎక్కువే. కానీ ఈ ఇద్దరి మధ్య జరిగే పోరులో కొనసాగింపునకు ఈ సారి బ్రేకులు పడిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పోటీ చేయడంతో..ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటి వరకు కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికలు అంటే గంప, షబ్బీర్ పైనే అందరి చూపూ ఉండేది. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా వెళ్లాల్సి వచ్చింది. అలాగే గంప గోవర్ధన్ స్థానంలో సీఎం కేసీఆర్ పోటీ చేయనుండటంతో..కామారెడ్డి ఎన్నికల సీన్ మొత్తం మారిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE