నేడు రాజకీయాల కోసం సమాజాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది, దీనిని గుర్తించి ప్రజలు ఐకమత్యంతో ఉండాలని హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. బుధవారం ఆయన మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎస్.హరీష్, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఐడీవోసీ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకొని ప్రారంభింపచేసుకున్నందుకు జిల్లా ప్రజలందరికీ అభినందనలు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500గా ఉందని, తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు ఇప్పటికే రూ.5 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు అదనంగా మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ. 70 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా భారీగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులతో పాటు చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రమంతటికీ నీళ్లిస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో నిరంతరం కరెంట్ అందిస్తున్నామని, హైదరాబాద్లో 24 గంటలూ కరెంట్ పోదు కానీ.. ఢిల్లీలో మాత్రం 24 గంటలు కరెంట్ ఉండదని ఎద్దేవా చేశారు. ఇక జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలన్న సీఎం.. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఏ రకంగానూ మంచిది కాదని అన్నారు. ఇప్పటికే 58 సంవత్సరాలు దగా పడ్డామని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY