తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 2 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు, మరో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 రాజ్యసభ స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) తమ అభ్యర్థుల పేర్లను బుధవారం నాడు ప్రకటించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) లను టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఈ 2 స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు మరియు ఓట్ల లెక్కింపు పక్రియ జరుగనుందని ఈసీ ప్రకటించింది. అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఏప్రిల్ 2, 2024 వరకు ఉన్న తన రాజ్యసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానానికి మే 30వ తేదీన ఉపఎన్నికతో పాటుగా, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ బలాన్ని పరిగణిస్తే ఈ మూడు స్థానాలను కూడా ఎలాంటి పోటీ లేకుండా పార్టీ అభ్యర్థులే దక్కించుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF