తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి నుంచీ అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగానే వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగానే పావులన్నీ కదిపాయి. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. కేసీఆర్ ను ఓడించడం మరో ఎత్తుగా వ్యూహాలన్నీ రచించాయి. కేసీఆర్ రెండు చోట్ల పోటీలో ఉంటే.. రెండు చోట్ల కూడా చెరో పార్టీకి చెందిన కీలక నేతలు పోటీకి నిలబడ్డారు. ఆయన పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కామారెడ్డి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ బరిలో నిలబడ్డారు. కేసీఆర్ ను ఓడించేందుకు అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించారు. అయితే.. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ కేసీఆర్ కు వ్యతిరేకంగా గాలి ఉందని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ సంగతి అటుంచితే.. కామారెడ్డితో పాటు అధికార, విపక్ష పార్టీ ల నుంచి కీలక నేతలు పోటీ చేసిన పాలేరు, గజ్వేల్, సిద్ధిపేట, మధిర, సిర్పూర్ , కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఏ నియోజకవర్గంలో అయినా.. అధిక శాతం పోలింగ్ జరిగితే అది అధికార పార్టీపై కోపమో, కీలక వ్యక్తిపై ప్రేమో కారణం అయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు గతం నుంచీ ఉన్నాయి. దీంతో నువ్వా నేనా అన్నట్లు సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు పోటీ చేసిన స్థానాల్లో పోలింగ్ ఎక్కువగా జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పోలింగ్ ను పరిశీలిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ముఖ్యులు పోటీ చేసిన స్థానాల్లో అధిర శాతం నమోదైంది. బీఆర్ ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తలపడిన కామారెడ్డిలో 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపుపై భారీ బెట్టింగ్ లు కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నడుమ అత్యంత ఆసక్తి రేపిన పాలేరులో రికార్డు స్థాయిలో 90 శాతం ఓట్లు పోలయ్యాయి. మునుగోడులో ఏకంగా 91 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీపడిన గజ్వేల్లో 81.20 పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో 76 శాతం, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్రావు కంచుకోట సిద్దిపేటలో 78 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో కూడా 89 శాతం, రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో 83 శాతం మంది ఓటేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్థానం సిర్పూర్లో 81.16 శాతం, ఈటల సొంత సీటు హుజూరాబాద్లో 89 శాతం పోలింగ్ నమోదైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో నిలిచిన కొత్తగూడెంలో 78.40 శాతం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ ఢీ అంటే ఢీ అని తలపడిన కరీంనగర్లో 68 శాతం మంది ఓట్లు వేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నడూ లేని స్థితిలో పోలింగ్ జరగడంతో కీలక నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరి సీటుకు ఎసరు వస్తుందో.. ఎవరికి భారీ మెజారిటీ వస్తుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE