దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు తెలంగాణలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాన్ని గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు కొత్తగా సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మించి ప్రారంభించుకుంటున్నందుకు అందరికీ అభినందనలు తెలిపారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూములు ధరలు పడిపోతాయని ఎన్నో రకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారని, కానీ పట్టుదలతో ఆ సమస్యలన్నింటినీ అధిగమించామని పేర్కొన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండగా మారిందని, ఎకరం భూమి ఉన్న వ్యక్తి కూడా కోటీశ్వరుడేనని కేసీఆర్ పేర్కొన్నారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని, ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులు ధారపోస్తానని వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరే సాక్ష్యమని ప్రజలతో అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, అదేవిధంగా రైతుబీమా సదుపాయం కింద దురదృష్టవశాత్తూ ఏ రైతు చనిపోయినా వారం పది రోజుల్లో రూ. 5 లక్షలు బీమా కింద జమవుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి రెండు మూడు రోజుల్లోనే చెల్లింపులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే రైతులకు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని, ఇలాంటి పథకాలు మరెక్కడా లేవని పునరుద్ఘాటించారు.
ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మనకు పంటలు పండే తెలంగాణ కావాలని, మంటలు మండే రాష్ట్రమైతే మన భవిష్యత్తే దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇక్కడ రాష్ట్రంలో.. అక్కడ కేంద్రంలో తాను, ప్రధాని మోదీ ఒకేసారి అధికారంలోకి వచ్చామని గుర్తుచేసిన కేసీఆర్, బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని తెలిపారు. తెలంగాణలో ఇస్తున్నట్లు దేశంలో మరే రాష్ట్రంలో 24 గంటల కరెంటు, మంచినీళ్లు ఇవ్వడం లేదని చెప్పిన ఆయన.. మన హైదరాబాద్లో 24 గంటల పాటు కరెంట్, ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని, కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, కుట్రలతో రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ ఇలాంటి రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY