తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని సోమవారం నాడు ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
అనంతరం తెలంగాణభవన్లో నోముల భగత్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు. అలాగే ఈ ఉపఎన్నికలో పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంసి కోటిరెడ్డి, నోముల లక్ష్మి, నోముల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నోముల భగత్ మంగళవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ