తెలంగాణలో అధికారం కాల్పోయి.. లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసేశారు. అధికార కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనే స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ హైకమాండ్ రాజయ్యకు టికెట్ నిరాకరించింది. స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగావున్న ఆయన్ను పక్కకు తప్పించి.. ఆయన స్థానంలో కడియం శ్రీహరిని బరిలోకి దింపింది. సర్పంచ్ నవ్య వ్యవహారంతో పాటు.. నియోజకవర్గంలో రాజయ్యపై వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆయనకు హైకమాండ్ టికెట్ నిరాకరించింది. దీంతో రాజయ్య అలకబూనారు. అప్పట్లో రాజయ్యను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో సర్దుకుపోయిన రాజయ్య.. కడియం శ్రీహరి గెలుపు కోసం కృషి చేశారు.
కానీ ఇప్పుడు రాజయ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్థానానికి పసునూరి దయాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన్ను కూడా తప్పించాలని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. వరంగల్ స్థానంపై అటు కాంగ్రెస్, బీజేపీలు కన్నేశాయి. బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానమైన వరంగల్ను ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. ఈక్రమంలో వరంగల్ నుంచి కొత్త వారిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే వరంగల్ నుంచి ఎంపీగా బరిలోకి దించేందుకు పలువరి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్ కల్పన, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నల పేర్లను బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తోందట. ఇప్పటికే రాజయ్యపై వ్యతిరేకత ఉండడంతో ఆయనకు ఈసారి కూడా టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదట.అటు బీఆర్ఎస్ పరిశీలిస్తున్న పేర్లలో తన పేరు లేకపోవడం.. హైకమాండ్ కూడా తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజయ్య బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారట.
ఇక హస్తం గూటికి వెళ్లేందుకు తాటికొండ రాజయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లిన రాజయ్య.. త్వరలోనే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ హామీ దక్కిన వెంటనే రాజయ్య కాంగ్రెస్ గూటికి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నాయి.