కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎల్ అండ్ టి సంస్థ అధికారులకు సీఎం తెలిపారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశం పై చర్చించేందుకు శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థ సీఈఓ అండ్ ఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యం సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, సంస్థ డైరెక్టర్ డి.కె.సేన్, ప్రాజెక్టుల సీఈఓ అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈఓ కె.వి.బీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా మూలంగా మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను ఈ సందర్భంగా కోరారు. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలుకు సంబంధించిన రవాణా, తదితర అంశాలు చర్చించిన సీఎం, వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సంబంధించి, ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించి తనకు నివేదికను అందచేయాలని సీఎంఓ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ