రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శనివారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్కు స్వాగతం పలికారు. ఒక న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ఆరంభించి గొప్ప రాజకీయ వేత్తగా ఎదిగారని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, యశ్వంత్ వంటి ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉందని, ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సిన్హాకు ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని, వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారని, తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారని తెలిపిన కేసీఆర్.. రేపు మోదీ ప్రసంగించనున్న సభలో తాము వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారని, మీ పాలనలో ఉద్యోగులు, విద్యార్థులు సహా ఏ వర్గం సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణం కేంద్రం విధాలేనని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ