తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యావంతుడైన కొల్లూరి చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారని ఆయన జీవితం అందరికీ ఆదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు.
“తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి తెలంగాణకు తీరనిలోటు. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిగా తోటి విద్యార్థులను కూడగట్టి 1969 జై తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ తన గొంతుక వినిపించారు. విద్యార్థిదశ నుంచి ఎన్నో సామాజిక ఉద్యమాల్లో బలమైన గొంతుకగా నిలిచిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సంతాపం తెలుపుతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ