రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జూన్ 17న వరంగల్ లో మంత్రి కేటిఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను శనివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. అనంతరం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన మంత్రి కేటిఆర్ వరంగల్ పర్యటనకు రానున్న తరుణంలో కుడా, నగర పాలక సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వరంగల్ పర్యటనలో మంత్రి కేటిఆర్ దాదాపు రూ.650 కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమాలుంటాయని మంత్రి వివరించారు. ఆయా కార్యక్రమాల అనంతరం వరంగల్ నగరం, కుడా అభివృద్ధిపై సమీక్ష చేస్తారని మంత్రి తెలిపారు. మంత్రి కేటిఆర్ కార్యక్రమాల వివరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
- కుడా ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్ లో నిర్మిస్తున్న ఆక్సీజన్ పార్క్ కి, వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో మంజూరైన 200 రెండు పడకల గదుల భవన సముదాయ నిర్మాణ పనులకు, కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద శంకుస్థాపనలు చేస్తారు.
- వరంగల్ నగరానికి చేరుకునే నర్సంపేట, ఖమ్మం, కరీంనగర్ ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలకు మంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేస్తారు.
- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల బాల సముద్రంలోని అంబేద్కర్ నగర్ లో 593 రెండు పడకల గదుల భవనాల సముదాయాన్ని మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారు. అక్కడే కాజీపేటలో నిర్మించే 97 రెండు పడకల గదుల గృహాల సముదాయానికి కూడా శంకుస్థాపన చేస్తారు.
- వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని బట్టల బజారు వై ఆకారంలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జీని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు.
- మురుగునీరు శుద్ధి ప్లాంట్ నాయుడి పేట పెట్రోల్ పంపు నుండి రెడ్డిపాలెం వరకు 8 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
- వరంగల్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ వద్ద ఏర్పాటు చేసిన పోతన జంక్షన్ ను ప్రారంభిస్తారు.
- కుడా ఆధ్వర్యంలో వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని మంత్రి కేటిఆర్ పరిశీలిస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu