తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు, అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే: సీఎం కేసీఆర్

CM KCR held Review Meeting to Finalise Strategy to be Adapted at Apex Council Meeting

ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికున్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొంటామని చెప్పారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆగస్టు 19, బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించి సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా రీ డిజైన్ చేశామని సీఎం చెప్పారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టిఎంసిలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని చెప్పారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని చెప్పారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే అని సీఎం స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామని, ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =