సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) పరిశోధకులు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా చేసిన ఎపిడెమియోలాజికల్ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ నగరంలో దాదాపు 6.6 లక్షల మంది కరోనా బారినపడినట్టు అంచనా వేశారు. గత 35 రోజుల్లో వీరంతా కరోనా బారినపడడమో, లేదా కోలుకోవడమో జరిగి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మందికి కరోనా లక్షణాలు ఉండకపోవచ్చని తెలిపారు. నగరంలో 80శాతం మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లలో నమూనాలను పరిశీలించి, కరోనా సోకినా వ్యక్తుల సంఖ్యను అంచనా వేసినట్టు వెల్లడించారు. కరోనా బాధితుల నుంచి నోరు, ముక్కు ద్వారానే కాకుండా మలమూత్రాల నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో ఇంటి నుంచి వచ్చే మురుగు నీటి ఆధారంగా హైదరాబాద్ నగరంలో ఎంత మంది కరోనా బారినపడి ఉంటారనే విషయాన్ని అంచనా వేశారు.
సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ, తమ పరిశోధనలో కరోనా బారినపడ్డ వ్యక్తులలో ఎక్కువ భాగం లక్షణాలు లేనివారు మరియు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చి ఉండదనే అంశం స్పష్టంగా సూచించిందని చెప్పారు. స్థానిక యంత్రాంగాల సమన్వయంతో ఇటువంటి అధ్యయనాలు మరిన్ని జరిగితే నగరంలోని హాట్స్పాట్లను గుర్తించడం మరియు ఇన్ఫెక్షన్ రేటును పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు దోహదపడే అవకాశముంటుందని అన్నారు. మరోవైపు మురుగునీటి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించదు, కేవలం అందులో ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu