తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, భారీ వర్షాల వల్ల వచ్చే అంటు వ్యాధులను అరికట్టేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితమై వచ్చే డయేరియా, దోమల వల్ల వచ్చే మలేరియా, చికెన్ గున్యా , డెంగ్యూ, ఇవి కాకుండా ఇతర వైరల్ ఫీవర్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
కరోనా తో పాటు ఈ జ్వరాలు అన్నింటికి చికిత్స చేసే విధంగా అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్, మందులు, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ కురుస్తున్న జిల్లాల మీద దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అన్ని హాస్పిటల్స్ లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డిని ఆదేశించారు.
ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ లో నాన్ కోవీడ్ హాస్పిటల్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందేలా చూడాలని వైద్య విద్యా సంచాలకులు డా రమేష్ రెడ్డిని ఆదేశించారు. అన్ని రకాల జబ్బులకు ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు , ఎఎన్ఎంలు రోజువారి సర్వే చేయాలన్నారు. జ్వరంతో పాటుగా ఇతర జబ్బులు ఉన్నా వారిని కూడా పరిశీలించాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టిపెట్టి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నివారణ చర్యలు, చికిత్సపై శుక్రవారం నాడు జిల్లా వైద్య అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu