తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది: సీఎం కేసీఆర్

CM KCR Inspects Construction Works of Yadadri Thermal Power Plant along with Ministers MLAs,CM KCR Inspected Yadadri Thermal Power Plant,Construction Works of Yadadri Thermal Power Plant,Yadadri Thermal Power Plant,Thermal Power Plant at Dameracherla,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి, ప్రైవేట్ కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్, మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తొలుత రెండు హెలికాప్టర్ లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మధ్యాహ్నం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలికి సీఎం చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి పవర్ ప్లాంట్ ఫేజ్-1, యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండవ ఫ్లోర్ కు చేరుకొని ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ట్రాన్స్ కో, జెన్ కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకన్నారు. అధికారులు పవర్ ప్లాంట్ గురించి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవర్ ప్లాంట్ కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది, దానికి సంబంధించిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా నీళ్లను సరఫరా చేసేవిధంగా ఏర్పట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణ పట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్ధేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

పవర్ ప్లాంట్ లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు. ఇదే ప్రాంతంలో భవిష్యత్ లో సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని దానికి అణుగునంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలని సీఎం సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు యాబై ఎకరాలు కేటాయించాలన్నారు. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాఫ్ కి అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలన్నారు. టౌన్ షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

దామరచర్ల హైవే నుండి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్ లైన్ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్ ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని, మిగితా యూనిట్స్ జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు సీఎంకి వివరించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకుపైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు సీఎంకి తెలిపారు. పవర్ ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ను అభినందించారు.

స్థానికుల సమస్యలన్నీ పరిష్కరించాలి:

యాదాద్రి పవర్ ప్లాంట్ కి భూమిని ఇచ్చిన రైతులతో పాటు, గతంలో సాగర్ ప్రాజెక్ట్ కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ని, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన సీఎం కేసీఆర్, అక్కడిక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యన్.బాస్కర్ రావు, నోముల భగత్, రవీంద్ర నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా మహెందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సీఎం సెక్రటరీ స్మితాసబర్వాల్, జెడ్పీ ఛైర్మన్లు బండ నరెందర్ రెడ్డి, వెలిమినేటి సందీప్ రెడ్డి, దీపిక, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, టూరిజ్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయ సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =