తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతుండంతో తీసుకోవలసిన జాగ్రత్తలు, లాక్డౌన్ అమలుతో పాటుగా పలు ఇతర అంశాలపైనా సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు. అలాగే కరోనా నియంత్రణకు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు.
ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ చేరుకొని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు అవుతున్న విధానం, తాజా పరిస్థితులను సీఎం కేసీఆర్ గవర్నర్కు వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలు, కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను కూడా గవర్నర్ తమిళిసై కి సీఎం కేసీఆర్ వివరించినట్టుగా సమాచారం.