కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా అందజేయడంతో పాటుగా, ప్రతి రేషన్ కార్డుకు నిత్యవసర వస్తువుల నిమిత్తం రూ.1500 నగదు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా ఏప్రిల్ 1న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ముఖ్యంగా హైదరాబాద్ లో 675 చౌక ధరల దుకాణాలు ఉండగా, ముందుగా ఒక్కో దుకాణానికి రోజుకు 100 కూపన్లు చొప్పున పంపిణీ చేస్తున్నారు. కూపన్లు ఉన్నవాళ్లే, వారికీ నిర్దేశించిన సమయంలో దుకాణానికి వద్దకు చేరుకొని బియ్యం తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. నగరంలో 5.80 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, అందరికి బియ్యం పంపిణి చేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడంతో పాటుగా శానిటైజర్లు, మంచినీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు.