బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి, పలువురు ఏపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ పూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, ఆ విషయంలో తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంక్రాంతి తర్వాత నుంచి పార్టీలో చేరికలు మరింత ఎక్కువుగా ఉంటాయని, తట్టుకోలేనంత ఒత్తిడి వస్తుందన్నారు. ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయని, పార్టీ అద్భుతంగా పురోగమించే అవకాశం ఉందన్నారు. మహామవులు, గొప్పగొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారన్నారు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారని, మీరు సిట్టింగ్ కదా అని అడిగితే మేం అక్కడ ఫిట్టింగ్ లేమని చెబుతున్నారన్నారు. ఏపీలో చేరికలతో పార్టీ బరువు, బాధ్యత చంద్రశేఖర్పై ఉంటుందని, పరిపాలన అనుభవం కూడా ఉందని, ఇక తడాఖా చూపించడమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అలాగే బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదని, ‘బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందని, లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదన్నారు. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని గతం నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయని, కొన్ని బాటలు వేయబడ్డాయన్నారు. అనంతరం రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయన్నారు. గత 50 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాల్నో అక్కడికి చేరుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ వచ్చిందన్నారు. ప్రబలమైన, గుణాత్మకమైనటువంటి మార్పు కచ్చితంగా తీసుకొచ్చి, ప్రజల ఆలోచనా సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటటువంటి ఆలోచనాపరులను ఏకం చేసి, ఒక మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
విశాఖలో ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తామన్నారు. ప్రధాని మోదీకి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం, మీది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్. విశాఖ ఉక్కును మోదీ అమ్మినా, మళ్లీ బీఆర్ఎస్ తిరిగి తీసుకుంటుంది. పబ్లిక్ సెక్టార్లో పెట్టుకుంటాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే విషయంలో ఏపీ కూడా భాగస్వామి కావాలని, అచ్చమైన అలసుసిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఈ రాష్ట్ర పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 6 లక్షల 64 వేల గ్రామాల్లో మన కమిటీలు ఏర్పడాలి. త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది. 4,123 అసెంబ్లీ నియోజవకర్గాల్లో మనం పరుగెడుతాం. రాజకీయ పని తనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి. కానీ గేమ్ లా ఉండకూడదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE