తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 19కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాల ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. అదే విధంగా ఈ ప్రతికూల సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకునేందుకు కూడా పలువురు హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక చారిటీ కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) పేరుతో ఏర్పాటైన ఈ కమిటీకి చిరంజీవి చైర్మన్ గా ఉండనున్నారు. సభ్యులుగా సురేష్ బాబు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, నిర్మాత సి.కల్యాణ్, నిర్మాత దాము, ‘మా’ అసోసియేషన్ యాక్టీవ్ ప్రెసిడెంట్ బెనర్జీ లు వ్యవహరించనున్నారు. సినీ కార్మికుల కోసం విరాళాలు అందించేవారు ఈ కమిటీని సంప్రదించవల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించిన వివరాలను తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు ఎన్.శంకర్ ఈ రోజు వివరించారు. సినీ కార్మికుల కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం ప్రకటించగా, అక్కినేని నాగార్జున రూ.కోటి, సురేశ్ ప్రొడక్షన్స్ తరఫున సురేశ్బాబు, వెంకటేష్, రానా కలిసి రూ.కోటి విరాళం ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా చెరో రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.
[subscribe]