భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా జరిగిన తోలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పరాజయంతో పాటుగా భారత్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ వన్డేలో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను ముగించనందు వలన ఐసీసీ భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించింది. నిర్దేశించిన సమయం ముగిసేలోగా భారత్ జట్టు 4 ఓవర్లు తక్కువ వేసింది. నిబంధనలను అనుసరించి ఒక్కో ఓవర్కు 20 శాతం చొప్పున 4 ఓవర్లకు 80 శాతం మ్యాచు ఫీజు కోత విధిస్తూ ఐసీసీ రెఫరీ క్రిస్ బ్రాడ్ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పొరపాటును అంగీకరించి జరిమానా ప్రతిపాదనకు ఒప్పుకోవడంతో ఎటువంటి అధికారిక విచారణ అవసరం ఉండదు. దీంతో ఇటీవల కాలంలోనే భారత్ జట్టు మూడోసారి జరిమానాకు గురైనట్టయింది. స్లోఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో 40 శాతం, ఐదో టీ20లో 20 శాతం జరిమానాకు భారత్ జట్టు గురైంది. ఇక న్యూజిలాండ్ తో ఫిబ్రవరి 8వ తేదీన రెండో వన్డే, ఫిబ్రవరి 11న మూడో వన్డే మ్యాచులు జరగనున్నాయి.
Home స్పోర్ట్స్
- Advertisement -