హైదరాబాద్ నగరం మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తుగల దేశంలోనే అతి పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, హాజరైన ప్రజలు వీక్షించి చప్పట్లతో స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ‘జై భీమ్’ అని నినదించారు. ఇక విగ్రహావిష్కరణ సందర్భంగా స్మారకం వద్ద బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా అంబేడ్కర్ విగ్రహా శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ప్రకాశ్ అంబేడ్కర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం కేసీఆర్తో కలిసి ప్రకాశ్ అంబేడ్కర్ భోజనం చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసింది విగ్రహం కాదు, ఒక చైతన్య విప్లవం. అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదు. విగ్రహా ఏర్పాటులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇకపై అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేస్తున్నాం. సమాజ శ్రేయస్సుకు పాటు పడినవారికి, ఉత్తమ సేవలు అందించినవారికి ఈ అవార్డులు అందిస్తాం. దీనికోసం రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తాం. ఏటా అంబేడ్కర్ జయంతి రోజున ఈ అవార్డులను ప్రదానం చేస్తాం. అంబేడ్కర్ స్పూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చాం. అలాగే రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. మనందరికీ మార్గదర్శనం చేసేలా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.
ఇక నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో మొత్తం 11.6 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టును నిర్మించారు. దీనిలో భారీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంగణం సుమారు ఆరు ఎకరాల వరకు ఉంటుంది. అందులో విగ్రహ నిర్మాణ ప్రాంతం 1.5 ఎకరం కాగా, మిగతా స్థలంలో ఉద్యానవనం, రాక్ గార్డెన్, ఫౌంటెన్ వంటి అదనపు హంగులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా మొత్తం రూ.146 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.84 కోట్లు వెచ్చించారు. మిగిలిన నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. స్మారక భవనం మీద ఠీవిగా కొలువుదీరిన అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్లడానికి ఇరువైపులా మెట్ల దారితో పాటు ఒకే సారి 15 మంది వెళ్లగలిగే రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. అలాగే భారీ భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా.. వందల ఏళ్ల పాటు విగ్రహం చెక్కు చెదరకుండా అత్యంత పటిష్టమైన లోహాన్ని ఉపయోగించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE