వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవడమే ధ్యేయంగా ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం మూడవరోజు మహబూబ్ నగర్ జిల్లా ఎల్లిగండ్ల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి గోప్లపూర్ కలాన్ మీదుగా సాయంత్రానికి మన్యంకొండ చేరుకోనుంది. అనంతరం రాత్రికి ధర్మపూర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ చేనేత కార్మికులను కలుసుకోనున్నారు. పాదయాత్ర విరామ సమయంలో వారు ఆయనను కలిసి తమ సమస్యలను వినిపించనున్నారు. కాగా ఇప్పటికే దీనిపై రాహుల్ గాంధీ పూర్తి సమాచారం తెప్పించుకున్నారని, చేనేత కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని టీకాంగ్రెస్ నేతలు తెలియజేశారు.
ఇక పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దారిలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నాయకులు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, టీపీసీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలు పెట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ వరకు దాదాపు 3,500 కి.మీ సాగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర పూర్తిచేసిన రాహుల్ గాంధీ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY