భువనగిరి కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో.. వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనబోనని తేల్చిచెప్పారు. చివరి వరకూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగానే చనిపోతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ పలువురు సీనియర్ నేతలను పిలిచారని, కానీ నాకు ఆహ్వానం లేదని మండిపడ్డారు.
రేపటి కాంగ్రెస్ పాదయాత్రకు సంబంధించి కూడా తనకు ఎలాంటి ఆహ్వానం లేదని, పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన వెంకట్ రెడ్డి.. దీనిని ఏఐసిసి నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఇటీవల చుండూరులో జరిగిన బహిరంగ సభలో పార్టీ నేత ఒకరు దూషించడాన్ని ఆయన తప్పుబట్టారు. బహిరంగ సభలో నన్ను దూషించిన వ్యక్తి అమాయకుడని, మునుగోడు కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశ్యపూర్వకంగానే తమ ప్రసంగంలో దుర్భాషలాడుతూ మాట్లాడేలా ప్రోత్సహించారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో టీపీసీసీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినప్పుడు, పార్టీ నాయకత్వం నన్ను ఆహ్వానించలేదని, పార్టీ సమావేశం గురించి నాకు తెలియజేయలేదని అన్నారు. టీపీసీసీ చీఫ్ మద్దతుతో కొందరు సీనియర్ నేతలు నన్ను కాంగ్రెస్ పార్టీని వీడాలని ఒత్తిడి తెస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF