రూ.7500 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలనుంచి రైతాంగం, రైతుసంఘాలు స్వయంగా వచ్చి, మరియు ఫోన్ల ద్వారా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బీజేపీ తెలంగాణశాఖ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. “రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ప్రభుత్వం నుండి సకాలంలో వారికి అందాల్సిన సహాయం ముఖ్యంగా రైతుబంధు నిధులు విడుదల కాకపోవడంతో పండించిన గిట్టుబాటు ధర లభించకపోవడం. రైతాంగం, రైతుసంఘాలు మా దృష్టికి వచ్చిన ప్రధానసమస్య. 2018 ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం లక్ష రూపాయలు రైతురుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితి చితికిపోయింది” అని అన్నారు.
రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు రుణమాఫీ చేసే విషయంలో కానీ, రైతుబంధు నిధులను విడుదల చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిపైన తెలంగాణ రైతాంగానికి జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం రైతుబంధు ఖాతాలో నిధులు జమచేయకపోతే పెట్టుబడి సహాయం కోసం రాష్ట్రంలోని రైతాంగం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించాల్సి వస్తుంది. వడ్డీ వ్యాపారస్థులకు వడ్డీ చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా తెలంగాణలో నిత్యం జరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణలో రైతుబంధు పథకానికి అర్హులైన ప్రతీ ఒక్క రైతు ఖాతాలో నిధులను జమచేయాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేసిన కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణ రాష్ట్రానికి అందించిన సహాయం గురించి లేఖలో ప్రస్తావించారు. ప్రధాని రైతులకు అందించిన సహాయం వల్లనే వారికి కొంత ఊరట లభించిందని అన్నారు. పీఎం కిసాన్ కింద ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5 వేల 8 వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. తెలంగాణలో ఒక్కో రైతు ఖాతాలో 20 వేల రూపాయలను కేంద్రప్రభుత్వం జమ చేసిందని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ రైతుల ఖాతాల్లో 580 కోట్ల రూపాయల నిధులను మే 31వ తేదీన జమచేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. వరికి రూ.100, పత్తికి రూ.350, వేరుశనగకు రూ.300, కందులకు రూ.300, పెసర్లు రూ.480, తెల్లనువ్వులు రూ.523, మక్కలపై రూ.92 పెంచి రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి పీఎం కిసాన్ కింద అందించిన సహాయంలాగే రాష్ట్రప్రభుత్వం కూడా 7,500 కోట్లు రైతుబంధు నిధులను వెంటనే విడుదలచేయాలని, 2018 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం 1 లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ఎటువంటి జాప్యం చేయకుండా పూర్తిగా అమలు చేయడానికి తగిన నిధులను కేటాయించాలని, ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు చేయూతగా నిలబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ను, స్కీమ్ ఫలితాలు రైతులకు అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా డబ్బును వెంటనే చెల్లించాలని, సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించాలని బీజేపీ తెలంగాణ శాఖ తరుపున కోరుతున్నామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY