హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజూర్నగర్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఇతర ప్రధాన పార్టీల మద్దతు కోరుతూ చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన పార్టీ మద్దతు కోరుతూ ఆ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి. హనుమంతురావు అక్టోబర్ 4, శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ లతో చర్చించారు. హుజూర్నగర్ లోని రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్. పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించిన లేఖను అందజేసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందజేయాల్సిందిగా కోరారు. ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే తెలంగాణ జన సమితి పార్టీ తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి, సీపీఐ పార్టీ తన మద్దతును టిఆర్ఎస్ పార్టీకి తెలియజేసిన సంగతి తెలిసిందే.
[subscribe]