తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరుపుతున్న చర్చలు, వరుసగా మూడో రోజు కూడ విఫలమయ్యాయి. దీంతో ముందే నిర్ణయించినట్టుగా ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ లభించకపోవడం వలనే సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. ప్రజలందరినీ ఆర్టీసీ ఉద్యోగులకు సహకరించాల్సిందిగా కోరారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ ల త్రిసభ్య కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేదని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. ఆర్టీసీలో ఉన్న 50వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎస్మాకు భయపడే ప్రసక్తే లేదని, ఆర్టీసీని బతికించడానికే ఈ సమ్మె చేస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులకు భయపడకుండా, నిర్భయంగా రేపు ఉదయం నుంచి కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రకటించడం తప్ప, ఒక్క డిమాండ్ కు కూడ హామీ ఇవ్వడం లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా సమ్మె నోటీసు ఇస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. మరో వైపు సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]