దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ బయోసేఫ్టీ లెవల్ (బీఎస్ఎల్)- 3 మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ ఐటీ,పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈ ల్యాబ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా కరోనా పరీక్షలతో పాటుగా ఇతర వైరస్ల నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్ల పరిశోధనలు కూడా నిర్వహించవచ్చు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల యొక్క సహకారంతో డీఆర్డీవో ఈ ల్యాబ్ ను తయారు చేసింది. రెండు భారీ కంటైనర్లలో రూపొందించిన ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ లో ప్రతిరోజు సుమారుగా వెయ్యి నిర్థారణ పరీక్షలు చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు వసతితో పాటుగా రూ.500 సాయం, రాష్ట్రంలోని పేద కుటుంబాలకు మనిషికి 12 కేజీల బియ్యం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబానికి రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu