తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కరోనా పంపిణీ విషయంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటుగా రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక కరోనా వ్యాక్సిన్ వేసేందుకు 50 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇప్పటికే పూర్తికాగా, జిల్లా స్థాయిల్లో సిబ్బందికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతుంది. వచ్చే వారం రోజుల్లో మండల స్థాయిలో కూడా సిబ్బందికి శిక్షణ మొదలు పెట్టనున్నారు.
మొదటి విడతలో సుమారు 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్:
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముందుగా మొదటి దశలో నాలుగు కేటగిరీల ప్రజలకు వ్యాక్సిన్ అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్స్, ఆశా వర్కర్స్ కు వ్యాక్సిన్ అందిస్తామని, ఇప్పటికే వారి వివరాలను కోవిన్ యాప్ లో నమోదు చేసినట్టు తెలిపారు. తర్వాత పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులకు అందిస్తామని చెప్పారు. మూడో కేటగిరి కింద జనాభాలో 18 శాతం ఉన్న 50 ఏళ్లు పైబడిన వారికి, అలాగే నాలుగో కేటగిరి కింద అనారోగ్యంతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ వేస్తామని అన్నారు. తెలంగాణలో మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా సుమారు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. జనవరి నెల మధ్యనుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అందుబాటులోకి వచ్చిన డోసులను బట్టి మొదటి 8 నుంచి 10 రోజుల్లో 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మరో 4 వారాలలో రెండవ డోసు కూడా అందిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ