తెలంగాణ అసెంబ్లీలో సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర విద్యుత్ బిల్లుపై అభ్యంతరం తెలిపారు. అసంబద్ధమైన బిల్లుకి రూపకల్పన చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని పేర్కొన్న ఆయన తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని, అసలు విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్లో కేంద్రం నిర్ణయాలపై ప్రశ్నించకుండా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని, విద్యుత్ సంస్కరణల ముసుగులో దేశంలోని రైతులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డా. అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, దీనిలో భాగంగానే దేశంలో వ్యవసాయం, విద్యుత్ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మొదటి కేబినెట్లోనే కేంద్రం 460 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు సీలేరును ఆంధ్రాకు కేటాయించిందని, దీనికి కారణం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతులో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారిపోయి ఆర్డినెన్స్ తెచ్చారని అన్నారు. దేశంలో గతంలో లేనంతగా ద్రవ్యోల్బణం, పేదరికం పెరగడానికి కేంద్రం అసంబద్ధ విధానాలే కారణమని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రిని కోరిందని, ఎవరు ముందు అమ్మితే వారికి వెయ్యి కోట్లు ఇస్తామని బహుమానాలు ఆశగా చూపుతోందని, మీ మాటలకు వంతపాడే ప్రభుత్వం మాది కాదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని, మోదీ ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో 11 రాష్ట్రాల్లో బిజెపి అనైతికంగా ప్రభుత్వాలను కూలగొట్టిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులు ఉన్న బిజెపి తమ ప్రభుత్వాన్ని కూలగొడుతామని ప్రగల్భాలు పలుకుతోందని, దానికి ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. నేను జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటే, ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని, తప్పకుండా వస్తామని, దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చరిత్రలో మోదీ, అమిత్ షాల కంటే గొప్ప నియంతలే గద్దె దిగిపోయారని, వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కూడా ఇంటికి వెళ్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY