హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం నేటి నుంచి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశలో మొత్తం 10 బస్సులు ఏర్పాటు చేసింది. వీటిలో 4 పూర్తి స్లీపర్ బస్సులు కాగా, 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఈ మేరకు కేపీహెచ్బీ కాలనీ బస్ స్టాపు వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ – కాకినాడ మరియు హైదరాబాద్ – విజయవాడ రూట్ల మధ్య నడవనున్నాయి. బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులుంటాయి. వీటిలో బస్సు ప్రయాణించే గమ్యస్థానాల వివరాలు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో కనిపిస్తాయి.
ఇక ఈ స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతీ బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు మరియు మొబైల్ చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. అలాగే ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్ బాటిల్తో పాటు ఫ్రెష్నర్ను ఫ్రీగా అందజేస్తారు. లగేజీ లోడింగ్, అన్లోడింగ్కు సహకరించేందుకు అటెండెంట్లు కూడా ఉంటారు. ఇంకా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్ రోడ్ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలుంటాయి. వీటితో పాటుగా ప్రయాణ సమయంలో అగ్నిప్రమాదాల నివారణకు పరికరాలు కూడా ఏర్పాటుచేశారు.
కాకినాడకు వెళ్లే బస్సులు – ప్రతిరోజూ రాత్రి 7:45 మరియు 8:30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్కు రాత్రి 7:15 మరియు 7:45 గంటలకు బయలుదేరుతాయి.
విజయవాడకు వెళ్లే బస్సులు – ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 9:30, 10:45, 11:45 గంటలకు మరియు, రాత్రి 9:30, 10:15, 11:15 గంటలకు బయలుదేరుతాయి. అలాగే విజయవాడ నుంచి ఉదయం 10:15, 11:15, మధ్యాహ్నం 12:15కు మరియు అర్ధరాత్రి 12:00, 12:45 గంటలకు బయలుదేరుతాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE