నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. ప్రధానంగా తీర ప్రాంత భద్రత, నదీజలాల భాగస్వామ్యం, అంతర్ రాష్ట్ర నేరాల నిర్వహణ వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దేశంలో రాష్ట్రాల పోటీ తత్వాన్ని పెంచడంతో పాటు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలైన.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో కూడిన ఈ కౌన్సిల్కు కేంద్ర హోంమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాగా ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.
కాగా తెలంగాణ నుంచి ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రతినిధుల బృందం హాజరు కానుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు నీటి పారుదల, విద్యుత్, హోంశాఖల నుంచి ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు. ఇక దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని, విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై రాష్ట్ర వైఖరిని తెలియజేయాలని ఆయన సూచించారు. అలాగే ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు నెల రోజుల్లోగా ఇవ్వాలంటూ ఇటీవల కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో.. సమావేశంలో దీనిని లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ నుంచి ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు అధికారులు హాజరవుతారని సీఎం జగన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ