ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు పన్నుతాయి. మాటలతో మాయ చేస్తాయి. చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని కూడా వివరిస్తాయి. హామీల వర్షం కురిపిస్తాయి. అయితే.. తెలంగాణ తాజా ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతలు కొత్త పల్లవి అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు వంటి ప్రముఖులు మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తెలంగాణ ఆగం అవుతుందని, అంధకారం ఏర్పడుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని పదే పదే చెబుతున్నారు.
వాస్తవానికి రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందింది. చెందుతోంది కూడా. అంతకుముందు జరిగిన ప్రచారానికి విరుద్ధంగా కరెంట్ సరఫరా జరుగుతోంది. ప్రధానంగా రాజధాని హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుంది. ట్రాఫిక్ సమస్య మినహా మెజార్టీ సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ అభివృద్ధిని అందరూ ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ న్యూయార్క్ లాగా అభివృద్థి చెందిందని గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని చూస్తుంటే తనకు విదేశీ నగరాలు గుర్తొస్తున్నాయని ఇటీవల నగరానికి వచ్చిన బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంసించారు.
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన హైదరాబాద్ రూపురేఖలు చూసి ఫిదా అయ్యారు. తాను గతంలో ఎన్నోసార్లు హైదరాబాద్ సందర్శించానని, అప్పటి హైదరాబాద్కు, ఇప్పటి హైదరాబాద్ ఎంతో తేడా ఉన్నదని పేర్కొన్నారు. 1990–2000 మధ్య చూసిన హైదరాబాద్కు, నేటి నగరానికి ఎంతో తేడా ఉందన్నారు. ఇప్పటికే సూపర్స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటి లయ వంటి వారు తాము హైదరాబాద్లో ఉన్నామా లేక అమెరికాలోనా ? అని ఐటీ కారిడార్ను చూసి ఆశ్చర్యపోవడం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడులో స్థిరపడిన టాలీవుడ్ నటుడు శ్రీరాం సైతం తాను గతంలో చూసిన హైదరాబాద్ ఇది కాదని, అతి తక్కువ కాలంలోనే నమ్మలేనంతగా ౖనగరం అభివృద్ధి చెందిందని అబ్బురపడ్డారు.
ఇదంతా ఓకే కానీ.. మళ్లీ తాము అధికారంలోకి రాకుంటే తెలంగాణ ఆగం అవుతుందని బీఆర్ఎస్ ప్రకటించుకోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల కోసం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, బెదిరింపు ధోరణికి దిగుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకుంటే.. తమ వ్యాపారం పోతుందని రియల్ ఎస్టేట్ వాళ్లు అనుకుంటున్నారని, అమరావతి లాగా హైదరాబాద్ తయారవుతుందని, వారంతా భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా? బలహీనమైన నాయకత్వం ఉండాలా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు తప్ప అభివృద్ధి ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎండ్రకాయ పార్టీ అని, ఒకరి కాలు ఒకరు లాక్కుంటారని, అన్నదమ్ములకే పడదని, అలాంటి వారు ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. మరి ఈ తరహా ప్రచారం బీఆర్ ఎస్ కు ఏ మేరకు ఓట్లను రాబడుతుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ