తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సోమవారం విడుదల చేసింది. మునుగోడు నియోజకవర్గంలో నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇక నవంబర్ 6న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఉపఎన్నికకు షెడ్యూల్ రావడంతో నేటి నుంచే మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ వర్తించనుంది. మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదమ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రాంనాథ్, ఒడిశాలోని ధామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నవంబర్ 3న పోలింగ్ జరగనుందని ఈసీ ప్రకటించింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీచేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారో ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ తేదీ: అక్టోబర్ 7
- నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: అక్టోబర్ 14
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 17
- పోలింగ్ తేదీ: నవంబర్ 3
- ఓట్ల లెక్కింపు పక్రియ: నవంబర్ 6.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY