అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలకు బిగ్ షాకులు తగిలాయి. మహామహులే ఈసారి ఓటమిపాలయ్యారు. బండి సంజయ్.. ఈటల రాజేందర్.. ధర్మపురి అరవింద్.. రఘునందన్ రావు వంటి నేతలు ఓటమిని చవిచూశారు. ఆయా నేతలంతా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బండి సంజయ్ తన సిట్టింగ్ స్థానం నుంచి కరీంనగర్ నుంచే ఈసారి కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రఘునందన్ రావు మెదక్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈటల రాజేందర్కు సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. మొదట మెదక్ నుంచి ఈటల పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ టికెట్ పైనే కరీంనగర్ నుంచి పోటీ చేసి బండి సంజయ్ను ఢీ కొట్టబోతున్నారని సోషల్ మీడియా కోడైకూసింది. ఇటీవల సంక్రాంతి రోజున కొత్తకొండ జాతరకు వెళ్లిన ఈటల.. అక్కడ కూడా తాను కరీంనగర్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.
ఇప్పుడు మరోసారి ఈటల తన రూట్ మార్చారు. మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గానికి గురి పెట్టారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి తాను ఆ టికెట్ ఆశించడం లేదని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. తాను మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని మనసులో మాట చెప్పేశారు. ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని హైకమాండ్ను కోరినట్లు ఈటల చెప్పారు. అలాగే హైకమాండ్ ఎలా ఆదేశిస్తే అలా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
అయితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్కు ఈసారి గట్టి పోటీ నెలకొంది. పెద్ద ఎత్తున నేతలు ఆ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావులతో పాటు మరికొంత మంది నేతలు ఆ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మల్కాజ్గిరి టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY