మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డికి పార్టీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటుగా ఆయన అనుచరులు, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన స్వర్గం రవి సహా పలువురు నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇటీవలే పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, వారికీ స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రులని, మంత్రులు అయ్యేంతవరకు తాము కలిసి పనిచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి చేదోడు వాదోడు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని అన్నారు. చేనేతలకు కూడా త్వరలోనే రైతుబీమా లాగా భీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే దళిత సంక్షేమ శాఖలో కూడా బీమా అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు తెలిపారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నో జాగ్రత్తలతో, ముందుచూపుతో పథకాలు అమలు చేశామని, ఈ రోజు అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ